యాప్నగరం

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలపై జగన్ ట్వీట్.. సీఎంకి యువత మొర

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు బుధవారం ఒక్కరోజే 1.34 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని ఏపీ సీఎం జగన్ తెలిపారు. గురువారం సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారన్నారు.

Samayam Telugu 31 Jul 2019, 8:44 pm
ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి శుక్రవారం అర్ధరాత్రి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.
Samayam Telugu ys jagan as cm1


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోందని ఆయన ట్వీట్ చేశారు. నిన్న (మంగళవారం) ఒక్కరోజే 1.34 లక్షల మందికిపైగా, మొత్తంగా ఈరోజు (బుధవారం) సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ ఆల్‌ ద బెస్ట్ అని జగన్ ట్వీట్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మొత్తం 22 రకాల ఉద్యోగాలను సర్కారు భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబరు 1న రాత పరీక్ష నిర్వహించనున్నారు. డీఎస్సీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
గ్రామ కార్యదర్శి (గ్రేడ్‌-4), గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), ఎఎన్‌ఎం (గ్రేడ్‌ -3), పశుసంవర్దకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనం, వ్యవసాయం, పట్టుపరిశ్రమ, మహిళా పోలీసులు, ఇంజినీరింగ్‌ సహాయకులు, డిజిటల్‌ సహాయకులు, గ్రామ సర్వేయర్‌, సంక్షేమ సహాయకులు.. ఇలా 13 ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు రూ.15 వేలు ఇస్తారు.
జగన్ ట్వీట్ పట్ల నెటిజన్ల స్పందిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని డీఎడ్ చేసిన వారు కోరుతున్నారు. ఇంటర్ చేసిన వారికి కూడా అవకాశం కల్పించాలని కొందరు కోరగా.. ఇతర రాష్ట్రాల్లో అగ్రికల్చర్ కోర్సులు చేసిన వారు నష్టపోతున్నారని మరొకరు ట్వీట్ చేశారు.
గ్రామ సచివాలయంలో ఆ గ్రామానికి చెందిన వారికే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు.. ఇప్పుడు జిల్లాను ప్రాతిపదికగా చేసుకుంటామని అంటున్నారు. పట్టణాల్లో ఉండేవారితో గ్రామీణ యువత పోటీ పడగలదా అని ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.