యాప్నగరం

అత్యాచారాలను నిరసిస్తూ నేడు ఏపీలో చైతన్య ర్యాలీలు

గతవారం దాచేపల్లి బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో ప్రభుత్యం ర్యాలీలను సోమవారం నిర్వహించనుంది.

Samayam Telugu 7 May 2018, 8:02 am
గతవారం దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో ప్రభుత్యం ర్యాలీలను సోమవారం నిర్వహించనుంది. మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ చైతన్య ర్యాలీలు నిర్వహిస్తోంది. దాచేపల్లి తరహా ఘటనలు ఇకపై రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ఈ ర్యాలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, వీటి నిర్వహణ బాధ్యతను అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. వీరికి సహాయకులుగా, సమన్వయకర్తలుగా మహిళా శిశు సంక్షేమశాఖ పీడీలు వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సాధికార మిత్రలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొంటారు.
Samayam Telugu ఏపీ ప్రభుత్వ చైతన్య ర్యాలీలు


జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రితోపాటు కలెక్టర్‌ లేదా ఎస్పీగానీ నేతృత్వం వహిస్తారు. కనీసం 3 కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించిన అనంతరం సమావేశంలో ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. స్థానికంగా జరిగిన అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలకు సంబంధించి జిల్లా ఎస్పీ తన ప్రసంగంలో ప్రజలకు వివరిస్తారు. ఇక విజయవాడలో సోమవారం నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆయన సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ర్యాలీని ప్రారంభించి, అక్కడ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్దకు చేరుకుంటారు. అదే సమయంలో నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరి స్టేడియం వద్దకు చేరుకుంటాయి. ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ అంటూ సభలో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు.

దాచేపల్లిలో జరిగిన అకృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. సమాజంలో ఇలాంటి రుగ్మతలనే పారదోలేందుకు, అత్యాచార ఘటనలు పునారవృతం కాకుండా అన్నివర్గాల వారికి అవగాహన కల్పించాలని కంకణం కట్టుకుంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి చట్టపరంగా కఠిన శిక్షలుంటాయన్న భయాన్ని కల్పించేలా సామాజికోద్యమాన్ని తీసుకొచ్చేందుకూ సిద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.