ఏపీ మంత్రి నారాయణ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అతని కుమారుడు నిశిత్ నారాయణ (22) ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశిత్ తన స్నేహితుడైన రాజా రవివర్మతో కలిసి బెంజ్ కారులో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడివైపు వస్తున్నారు. కారు అతి వేగంగా వెళ్తుండడంతో అదుపుతప్పి మెట్రో పిల్లర్ నెంబర్ 9 ను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ కూడా ప్రాణాలు నిలవలేదంటే... ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. స్నేహితులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దారిన పోయే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరేలోపే తుదిశ్వాస విడిచారిద్దరూ. ప్రమాదం జరిగిన స్థలం నుండి కారును తొలగించారు పోలీసులు. నిశిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉన్నారు. మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయనకు విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరారు.
ఏపీ మంత్రి నారాయణ కుమారుడి దుర్మరణం
ఏపీ మంత్రి నారాయణ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది.
TNN 10 May 2017, 7:47 am