యాప్నగరం

‘ఆయన పాదయాత్రతో భూముల ధరలు తగ్గిపోయాయి’!

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రపై టీడీపీ మరోసారి విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాల్లో ముగిసి కృష్ణాలోకి ప్రవేశించింది.

Samayam Telugu 15 Apr 2018, 1:52 pm
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రపై టీడీపీ మరోసారి విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాల్లో ముగిసి కృష్ణాలోకి ప్రవేశించింది. గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి 2-3 వేల రూపాయలకు తగ్గిపోయిందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో ఈ నెల 21 న సీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని ఎద్దేవా’ చేశారు. అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జగన్ జిల్లాను దాటేశారని దుయ్యబట్టారు.
Samayam Telugu మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు తన జన్మదినమైన ఏప్రిల్ 20 న నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని మరోసారి మంత్రి తెలియజేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని విమర్శించి బలహీన పరచడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు. చిత్త శుద్ధితో పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి పక్షాన ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా పోరాటం చేయాలని సోమవారం జరిగే బంద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీకి దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్‌ విసిరారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం కృష్ణా వారధి సమీపంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందని ఆరోపించారు. రాజధాని మొదలుకుని ప్రత్యేక హోదా వరకు పూటకో మాట, రోజుకో డ్రామాలడుతున్నారని విమర్శించారు. బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. అమరావతిని భ్రమరావతిగా, అవినీతికి మారుపేరుగా మార్చారని జగన్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.