యాప్నగరం

వైసీపీ-బీజేపీ దోస్తీ బయటపడింది.. జైట్లీ వ్యాఖ్యలు పెద్ద జోక్: యనమల

సీబీఐ, ఈడీ, ఐటీ వంటి స్వతంత్ర సంస్థల్ని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేశారు.. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా పెద్ద డ్రామా అని తేలిపోయింది..

Samayam Telugu 7 Oct 2018, 1:43 pm
మోదీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మాట్లాడిన మంత్రి.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి స్వతంత్ర సంస్థల్ని బీజేపీ జేబు సంస్థలుగా మార్చేసిందన్నారు యనమల. ఈ సంస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమన్నారు. చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబందించి.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన మీడియా సమావేశం.. ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అజ్మీర్ సభ ఉందనే కారణంతోనే సమయాన్ని మార్చారని ఆరోపించారు. ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలన్నారు మంత్రి.
Samayam Telugu Yanmala.


రాబోయే ఎన్నికలు సుస్థిర, అరాచక కూటముల మధ్య పోటీ అంటూ అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు యనమల. ప్రజలకే మేలు చేయలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజల హక్కుల్ని కాలరాసి.. ప్రతిపక్షాలను అణిచివేసేది సుస్థిర ప్రభుత్వం కాదన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నవారిని మోసం చేసిన బీజేపీ.. దేశంలోని కూటములపై ఎలా విమర్శలు చేస్తుందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అరాచ కూటముల పేరుతో కొత్త ఎత్తగడ వేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్డీఏ హయాంలో పెట్రో ధరలు, ఎరువులు, గ్యాస్‌, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని.. చివరికి రూపాయి విలువ పడిపోయిందన్నారు యనమల. ఈ నాలుగేళ్లలో కేంద్రానికి ఘోర వైఫల్యాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు మోసాన్ని సహించరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. ఎవరిది అరాచకమో.. ఎవరిది సుస్థిర ప్రభుత్వమో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు యనమల.

వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా పెద్ద డ్రామా అని తేలిపోయిందన్నారు మంత్రి. శనివారం ఎన్నికల సంఘం ప్రకటనతో ఈ లాలూచీ రాజకీయం బయటపడిందన్నారు. వైసీపీ బీజేపీతో లాలూచీపడి.. ఉప ఎన్నికలు రాకుండా చివరిలో ఎంపీల రాజీనామాలను ఆమోదించారని విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులే చెప్పారని గుర్తు చేశారని.. ఇక్కడే ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.