యాప్నగరం

జగన్‌‌పై దాడి.. హైదరాబాద్ చేరుకున్న ఏపీ పోలీసులు

తనపై దాడి అనంతరం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్, చికిత్స కోసం సిటీ న్యూరో హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Samayam Telugu 26 Oct 2018, 10:39 am
గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనలో గాయపడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జగన్‌ను విచారించి, ఆయన వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఏపీ పోలీసులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. జగన్‌పై జరిగిన దాడి విచారణకు ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ బృందం శుక్రవారం తెల్లవారుజామున నగరానికి వచ్చింది. ఈ బృందానికి అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు నేతృత్వం వహిస్తుండగా డీఎస్పీ నాగేశ్వరరావు, మరో ఇద్దరు ఎస్ఐలు సహాయకులుగా ఉన్నారు.
Samayam Telugu JAGAN-1


హత్యాయత్నానికి సంబంధించి జగన్ వెల్లడించే వివరాలను సిట్ బృందం రికార్డు చేయనుంది. దాడి అనంతరం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్, చికిత్స కోసం సిటీ న్యూరో హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం జగన్ పరిస్థితి నిలకడగా ఉండగా, మరికాసేపట్లో ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి అధికారులు ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన తర్వాత సిట్ అధికారులు జగన్‌ను కలవనున్నారు.

దాడి తరువాత, సిటీ న్యూరో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ జగన్‌ను, ఆయన తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పరామర్శించారు. ఆసుపత్రిలో కుమారుణ్ని చూసి ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. జగన్‌ను చూసి తల్లడిల్లిపోయిన విజయమ్మ అతడికి తగిలిన గాయం తీవ్రత గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగన్‌పై దాడి గురించి తెలియగానే లోటస్ పాండ్‌ నివాసంలో విజయమ్మ కుప్పకూలిపోయారు. దీంతో గురువారం ఆసుపత్రికి రాలేకపోయిన ఆమె, శుక్రవారం ఉదయం వచ్చి, కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.