యాప్నగరం

ఉత్సవమూర్తి తస్కరణ కేసు: అర్చకులు సస్పెండ్

బాసర సరస్వతి ఉత్సవ విగ్రహం తరలింపు వివాదానికి సంబంధించి ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం..

TNN 9 Aug 2017, 8:08 pm
బాసర సరస్వతి ఉత్సవ విగ్రహం తరలింపు వివాదానికి సంబంధించి ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ అంశంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. ఈ వివాదానికి మూలకారకుడైన ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్‌తో పాటు ప్రణవ్ అనే మరో అర్చకుడిని సస్పెండ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు మీడియాకు తెలిపారు. మరోవైపు అమ్మవారి ఉత్సవ విగ్రహం జాడ ఇంతవరకూ లభించలేదు. తమ ప్రమేయమేమీ లేదని తప్పించుకునే చర్యల్లో భాగంగా.. విగ్రహాన్ని మాయం చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున నల్గొండ జిల్లా దేవరకొండలో అక్షరాభ్యాసాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్‌ ఆలయం నుంచి ఉత్సవమూర్తిని తస్కరించినట్లు గుర్తించారు.
Samayam Telugu basara temple priests suspended over missing idol case
ఉత్సవమూర్తి తస్కరణ కేసు: అర్చకులు సస్పెండ్


పూజా సామగ్రి స్టోర్‌ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగి సుశీల నుంచి సంజీవ్‌కుమార్.. ఉత్సవమూర్తిని తీసుకున్నాడు. ఆ తర్వాత విగ్రహం కనిపించకుండా పోయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. పూజా కార్యక్రమాల కోసమేనని భావించి తాను ఉత్సవమూర్తిని సంజీవ్‌కుమార్‌కు అప్పగించినట్టు సుశీల అధికారులకు వివరణ ఇచ్చారు. దేవరకొండలో అక్షరాభ్యాస పూజల అనంతరం సంజీవ్‌కుమార్‌.. ఉత్సవమూర్తిని తిరిగి అప్పగించడానికి ప్రయత్నించగా తాను తీసుకోలేదని, ఆ విషయాన్ని ఆలయ పర్యవేక్షకుడు గిరిధర్‌ దృష్టికి తీసుకెళ్లానని ఆమె పేర్కొన్నారు.

ప్రధానార్చకుడు ఉత్సవమూర్తిని ఆలయ దక్షిణ భాగం నుంచి తన కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లినట్టు ఆలయ ఉద్యోగులు చెప్పారు. దీనిపై ఆరా తీయడానికి ఆలయ పర్యవేక్షకుడు గిరిధర్‌.. సంజీవ్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. ఉత్సవమూర్తి తన వద్ద లేదని ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన ఫోన్‌లోనూ అందుబాటులోకి రాలేదు.

విగ్రహ ఆచూకీ తెలుసుకునే క్రమంలో మంగళవారం (ఆగస్టు 8) ఆలయ సిబ్బంది ప్రధానార్చకుడి ఇంటికి వెళ్లగా.. కుటుంబసభ్యులు ఆయన ఇంట్లో లేరంటూ సమాధానమిచ్చారు. ఆలయంలో తనకు కేటాయించిన బీరువాలోనే సంజీవ్‌కుమార్.. ఆ విగ్రహాన్ని దాచి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఉత్సవమూర్తిని తాను అపహరించలేదని, గర్భగుడిలోనే ఉందని.. తనపై కుట్రపూరితంగా ఏఈవో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సంజీవ్‌కుమార్ చెప్పడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.