యాప్నగరం

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు

నంద్యాలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని సూరజ్‌గ్రాండ్‌ హోటల్‌ వద్ద భూమా, శిల్పా వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది..

TNN 24 Aug 2017, 1:47 pm
నంద్యాలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని సూరజ్‌గ్రాండ్‌ హోటల్‌ వద్ద భూమా, శిల్పా వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఘర్షణలు అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇరువర్గాలకు చెందిన నేతలు పరస్పరం ఎదురుపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu bhuma versus shilpa police firing in nandyal
నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు


వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత సలీం భాషా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డి తిరిగి వస్తుండగా.. సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ వద్ద భూమా వర్గానికి చెందిన అభిరుచి మధుతో పాటు మరికొంత మంది అనుచరులు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదవడంతో పరస్పర రాళ్ల దాడులకు దిగారు. ఇదే సమయంలో మధు గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరు వర్గీయులను చెదరగొట్టారు.

నంద్యాల నియోజకవర్గంలో బుధవారం (ఆగస్టు 23) ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ తరఫున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేశారు. ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తింది. ఫలితంగా నంద్యాలలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైంది. ఆగస్టు 28న ఫలితాలు వెలువడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.