యాప్నగరం

‘హరీశ్‌రావును పొమ్మనలేక పొగబెడుతున్నారు’

టీఆర్ఎస్‌లో ఇంటిపోరు తీవ్రం అవుతుందన్న సంకేతాలు రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తున్నాయని రఘునందన్ రావు చెప్పారు.

Samayam Telugu 22 Sep 2018, 5:03 pm
రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తోందంటూ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించడం ఆ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చీనీయాశమైంది. కాగా, హరీశ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు స్పందించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వంచనకు మారుపేరు అని దుయ్యబట్టారు. అందుకు హరీశ్ వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు.
Samayam Telugu KCR And Raghunandan Rao


తన మేనల్లుడు హరీశ్‌ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టినట్లు కనిపిస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోందని, హరీశ్ వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌లో ఇంటిపోరు తీవ్రం అవుతుందన్న సంకేతాలు రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. కారుకు ఉన్న నాలుగు టైర్లలో ఒకటి పంచర్ అవుతుందని తెలిసి, స్టెప్నీగా సంతోష్‌ను రాజ్యసభకు పంపించారని రఘునందన్‌రావు వెల్లడించారు.

కాగా, సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో సెప్టెంబర్ 21న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన హరీశ్.. ‘నా ఊపిరి ఉన్నంతకాలం, భగవంతుడు శక్తిని ఇచ్చినంత కాలం మీకు సేవ చేస్తా. అక్కా చెల్లెళ్ల రుణం ఏం చేసినా తీర్చుకోలేను. వర్షంలో తడుస్తూ కూడా బోనాలు బతుకమ్మలు, మంగళహారతులతో అపూర్వ స్వాగతం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలతోనే రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుంది. ఇంతకంటే ఓ మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికి. ఈ తృప్తితోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది’ అని హరీశ్ అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.