యాప్నగరం

Janasenaలోకి బీజేపీ ఎమ్మెల్యే!

ఏపీలో బీజేపీకి షాక్ తగలడం ఖాయమేనని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరుతున్నట్లు అనుచరులు ధ్రువీకరించారు.

Samayam Telugu 10 Jan 2019, 3:59 pm
బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీ వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారుతారంటూ పక్షం రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన వివరణ కూడా ఇచ్చారు. అవన్నీ ఊహాగానాలేనన్నారు. అయితే.. ఆకుల ప్రధాన అనుచరులు తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. ఆయన పార్టీ మారుతున్న మాట వాస్తవమేనని తెలిపారు..
Samayam Telugu Akula


ఆకుల సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య లక్ష్మీ పద్మావతి పవన్‌ అభిమాని కావడం గమనార్హం. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ శ్రీకాకుళంలో జనసేనాని చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ ఆఫీసు వద్ద పద్మావతి దీక్ష చేశారు. ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

జనసేన పార్టీ తరఫున ఆకుల పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆకుల సత్యనారాయణకు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం ఇవ్వడానికి కూడా జనసేన అధినేత అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనున్నారని.. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారని అనుచరులు చెబుతున్నారు. జనవరి 21న ఆయన అధికారికంగా జనసేనలో చేరతారని పేర్కొంటున్నారు.

వైద్యుడిగా, రియల్‌ ఎస్టేట్ ‌వ్యాపారిగా ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరం ప్రజలకు సుపరిచితుడు. ఏడేళ్ల కిందట బీజేపీలో చేరిన ఆయన 2014లో అనూహ్యంగా టికెట్‌ పొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఆయన రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం టికెట్ పొందారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.