యాప్నగరం

ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రామా.. ఆయనే రాయితో కొట్టుకుని పోలీసులపై నింద!

స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని పోలీసుల అనుమతి లేకుండా అర్ధరాత్రి జుమ్మెరాత్ బజార్ చౌక్‌ వద్ద పున:ప్రతిష్ఠ చేయడానికి రాజాసింగ్, ఆయన అనుచరులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది.

Samayam Telugu 20 Jun 2019, 11:45 am
హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లో అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేశారని, తనను గాయపరిచారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల లాఠీచార్జ్‌ చేయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ గాయపడ్డారంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కానీ, రాజాసింగ్ స్వయంగా రాయితో కొట్టుకుని గాయపరుచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వీడియో ఆధారాన్ని కూడా చూపుతున్నారు. తాజాగా బయటికొచ్చిన వీడియో ప్రకారం.. పోలీసులు అడ్డుకుంటున్నా రాజాసింగ్ మాత్రం పెద్ద రాయిని రెండు చేతులతో పైకిలేపి ఒక్కసారిగా తలపై కొట్టుకున్నారు. దీంతో ఆయన తలకు గాయమైంది.
Samayam Telugu RajaSingh_Police


స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని పోలీసుల అనుమతి లేకుండా అర్ధరాత్రి జుమ్మెరాత్ బజార్ చౌక్‌ వద్ద పున:ప్రతిష్ఠ చేయడానికి రాజాసింగ్, ఆయన అనుచరులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది. విగ్రహ పున:ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్గం విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులకు, ఆ వర్గానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన రాజాసింగ్ రాయితో తలపై కొట్టుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రాజాసింగ్ బెదిరించారు.
గాయపడిన రాజాసింగ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అవుట్ పేషెంట్‌లో పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల తాను గాయపడ్డానని రాజాసింగ్ పేర్కొన్నారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ ఎన్.నరసింహారెడ్డి, గోషామహల్ ఏసీపీ ఎం.నరేంద్రరెడ్డి, షాహినయత్‌గంజ్ ఎస్సైలు గురుమూర్తి, రవికుమార్ లాఠీలతో రాత్రి 1.30 గంటల సమయంలో తనపై దాడిచేసినట్లు అవుట్ పేషెంట్ పేపర్‌పై రాశారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు.

అయితే, ఈ ఘటనపై షాహినయత్ గంజ్ ఇన్‌స్పెక్టర్‌తో ‘సమయం’ మాట్లాడింది. రాజాసింగ్‌, ఆయన అనుచరులపై తాము లాఠీ చార్జ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన అనుచరులు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని జుమ్మెరాత్ బజార్ సర్కిల్ వద్ద పున:ప్రతిష్ఠ చేస్తున్నారనే సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామని, వారిని అడ్డుకున్నామని అన్నారు. తాము అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన రాజాసింగ్ తనకు తానే రాయితో తలపై కొట్టుకున్నారని, పైగా తనపై లాఠీచార్జ్ చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.