యాప్నగరం

అమిత్ షా పోటీ చేసినా అక్కడ బీజేపీ గెలవదు: అసదుద్దీన్

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడున్న 5 స్థానాల్లోనూ బీజేపీ గెలవదని జోస్యం చెప్పారు.

Samayam Telugu 15 Sep 2018, 5:54 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడున్న 5 స్థానాలు కూడా తిరిగి దక్కవని ఎంఐఎం అధినేత అసదుద్దీని ఒవైసీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అదే ప్రచార పద్ధతి (స్ట్రాటజీ)ని అనుసరిస్తున్నారని, ఇక్కడ ఆయనకు పరాభవం తప్పదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజల చేతిలో అమిత్ షాకు ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అమిత్‌ షా హైదరాబాద్‌ నుంచి పోటీచేయాలని.. అలాగైనా తమ పార్టీయే గెలుస్తుందని అసదుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశారు.
Samayam Telugu asad


తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా శనివారం (సెప్టెంబర్ 15) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ‘సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహించట్లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని విమర్శించారు. ఓ నెటిజన్ ఈ వ్యాఖ్యలను ట్విటర్ ద్వారా అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దీనిపై స్పందించారు.

పెట్రోల్‌, డీజిల్ ధరల నియంత్రణ, యువతకు ఉద్యోగాల కల్పన, డాలరుతో రూపాయి విలువ పతనంపై బీజేపీ విధానాలేంటో వెల్లడించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, కౌన్సెలర్లు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని చెప్పిన అసదుద్దీన్.. ఎన్నికల కోసం కూటమి కట్టిన విపక్షాలు నాలుగేళ్లుగా ఎక్కడ పోయారని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.