యాప్నగరం

అమ్మా బైలెల్లినాదో.. గోల్కొండ నుంచి బోనాల జాతర ప్రారంభం

జంట నగరాల్లో బోనాల జాతర ప్రారంభమైంది. డప్పు చప్పుళ్ల హోరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతలతో నగరంలో కోలాహలం షురూ అయింది.

Samayam Telugu 4 Jul 2019, 7:22 pm
భాగ్య నగరంలో బోనాల జాతర ప్రారంభమైంది. గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ అమ్మవారికి గురువారం (జులై 4) ఉదయం భక్తులు తొలి బోనం సమర్పించారు. అంతకుముందు టోలీచౌకీ నుంచి ఫలహార ర్యాలీ ప్రారంభమైంది. మార్గమధ్యంలోని పూజారి ఇంటి వద్ద అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి కొండపై ఉన్న అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్ల హోరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతలతో బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Samayam Telugu bonalu
బోనాలు జాతర (ఫైల్ ఫోటో)


తెలంగాణలో గోల్కొండ బోనాలతో ఆషాఢమాస బోనాల జాతర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు ఈ జాతర కొనసాగుతుంది. జంటనగరాల్లో మాత్రం ఆషాఢ మాసంతో బోనాల జాతర పూర్తవుతుంది. ఒక్కో వారం నగరంలోని ఒక్కో ప్రాంతంలో నెల రోజుల పాటు బోనాల జాతర సాగుతుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఏటా బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించే విషయం తెలిసిందే. ప్రతి గురు, ఆదివారం రోజుల్లో ఆయా ఆలయాల పరిధిలో అమ్మవార్లకు బోనాల సమర్పణ ఉంటుంది. బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలాగే ఘనంగా ఏర్పాట్లు చేసింది.

బోనాల జాతరకు పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.