యాప్నగరం

జగన్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు: బొత్స

‘కాపు రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు. అయితే ఒక్కసారి ఆ హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Samayam Telugu 29 Jul 2018, 2:47 pm
‘కాపు రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు. అయితే ఒక్కసారి ఆ హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిజర్వేషన్ల విషయంలో హామీ ఇస్తే జగన్ దానికి కట్టుబడతారు. అయితే అది కేంద్రం పరిధిలోని అంశం. అందుకే ఆ విషయంలో జగన్ హామీని ఇవ్వలేదు..’ అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబులా మోసపూరిత మాటలు చెప్పలేదని బొత్స వ్యాఖ్యానించారు.
Samayam Telugu Botsa


కాపు రిజర్వేషన్ల హామీని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చారని, అయితే దాన్ని అమలు చేయలేదని, తద్వారా బాబు మోసపూరిత వైఖరి బయటపడింది అని బొత్స అన్నారు. చంద్రబాబులా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపులను మోసం చేయదలుచుకోలేదని, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి మాట తప్పదలుచుకోలేదని బొత్స వ్యాఖ్యానించారు. తాము ప్రజలను మభ్యపెట్టదలుచుకోలేదని, హామీ ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని తాము చెబుతున్నామని అన్నారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో జగ్గంపేటలో జగన్ మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో కాపులకు తను హామీ ఇవ్వలేను అని అన్నారు. అది కేంద్ర పరిధిలోని అంశమని దానిపై తను హామీ ఇవ్వలేను అన్నారు. అయితే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు స్థాయిలో నిధులను కేటాయించగలనని మాత్రం జగన్ హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.