యాప్నగరం

బుల్లెట్ ట్రైన్‌పై హైదరాబాద్ కుర్రాడి లోగో!

హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు అరుదైన ఘనత సాధించాడు.

TNN 26 Oct 2017, 12:45 pm
హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు అరుదైన ఘనత సాధించాడు. దేశంలో తొలి హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కు లోగోను డిజైన్ చేశాడు. భారత తొలి బుల్లెట్ రైల్ కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేటషన్ లిమిటెడ్ (NHSRCL) నిర్వహించిన లోగో డిజైన్ కాంటెస్ట్‌లో లక్డీకాపూల్‌కు చెందిన ఆళ్ల చక్రధర్ రూపొందించిన లోగో తొలి బహుమతిని గెలుచుకుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఆర్కిటెక్ట్, పెయింటర్ సతీశ్ గుజ్రాల్ చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్‌ను చక్రధర్ అందుకున్నారు. ఇంజిన్‌పై చిరుతపులి పరిగెడుతున్నట్లు ఉన్న ఈ లోగోను రూపొందించడానికి మూడు వారాల సమయం తీసుకున్నట్లు చక్రధర్ చెప్పాడు.
Samayam Telugu bullet train logo has hyderabad youths stamp
బుల్లెట్ ట్రైన్‌పై హైదరాబాద్ కుర్రాడి లోగో!


ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజసన్ (ఎన్ఐడీ)లో గ్రాఫిక్ డిజైనింగ్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతకుముందు తిరుచ్చిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తొలి బహుమతి అందుకున్న సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ.. ఇది తనకు గొప్ప అనుభూతి అని, భవిష్యత్తులో మరింత సాధించడానికి ఇదొక అవకాశమని అన్నాడు. లోగోలో ఉన్న చిరుతపులి బుల్లెట్ ట్రైన్ వేగాన్ని తెలియజేస్తుందని తెలిపాడు. లోగోలో వాడిన నీలం, ఎరుపు, బూడిద రంగులు.. భద్రత, వేగం, సౌకర్యానికి నిదర్శనాలని చెప్పాడు.

కాగా, గొప్ప వ్యక్తి అయిన గుజ్రాల్ నుంచి తన కొడుకు అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందని చక్రధర్ తండ్రి ఆళ్ల శివకోటి ప్రసాద్ చెప్పారు. ఎన్‌హెచ్ఎస్ఆర్ఎల్ వంటి సంస్థతో పనిచేయడం గొప్ప అవకాశమని అన్నారు. స్కూల్ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలనేది తన కొడుకు కలని, దాన్ని అతను సాధించగలడే నమ్మకం తనకు ఇప్పుడు పూర్తిగా ఉందని ప్రసాద్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.