యాప్నగరం

నా తల్లిదండ్రులను నిందించడం దారుణం: చంద్రబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Samayam Telugu 28 Mar 2018, 11:15 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమని, తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా? అని సీఎం ప్రశ్నించారు. ప్రధాని కాళ్లకు మొక్కడమే భారతీయ సంప్రదాయమా? అంటూ మండిపడ్డారు. ఇటువంటి వాళ్లను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అంటూ విరుచుకుపడ్డారు.
Samayam Telugu Chandrababu


పార్లమెంటులో పరిణామాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో బుధవారం ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాష్ట్రానికి న్యాయం చేయమంటే తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించేది లేదు. రహస్యంగా ఎవరితో మంతనాలు జరపొద్దు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. విజయసాయిరెడ్డి చర్యలు, వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారు. ఇది ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం’ అని పార్టీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

బుధవారం నుంచి ఏప్రిల్ 6 వరకు ఎంపీలంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని చంద్రబాబు సూచించారు. ఎవరికీ సొంత అజెండాలు ఉండకూడదని.. ఐదు కోట్ల ప్రజల అజెండానే మన అజెండా కావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం కన్నా, ప్రజల హక్కులు కాపాడటం కన్నా ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. విభజన చట్టంలో 19 అంశాలు అమలుచేయాలని, పార్లమెంటు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మన హక్కుల కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోకుండా చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.