యాప్నగరం

ప్రజా వేదికను నాకు కేటాయించండి.. జగన్‌కు బాబు లేఖ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నానో దానిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేట్ ఓనర్‌తో షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని చెప్పారు.

Samayam Telugu 5 Jun 2019, 2:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటోన్న ఇంటి పక్కనే ఉన్న ప్రజా వేదికను తన అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని సీఎం జగన్‌ను లేఖలో కోరారు. తాను ఉంటోన్న ఇంటిలో ఖాళీ స్థలం ఏమీ లేనందున, ప్రతిపక్ష నేత హోదాలో తనకు ప్రజా వేదికను కేటాయించాలని కోరారు.
Samayam Telugu Chandrababu


అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నానో దానిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేట్ ఓనర్‌తో షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని చెప్పారు. ఈ ఇంటికి పక్కనే ప్రజా వేదిక ఉన్నందున దాన్ని తన అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని అనుకుంటున్నానని, దాన్ని తనకు కేటాయించాలని కోరారు. వాస్తవానికి, ప్రస్తుతం ఉండవల్లిలో చంద్రబాబు ఉంటోన్న ఇంటికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే అద్దె చెల్లించేది. ఇప్పుడు చంద్రబాబే చెల్లిస్తున్నారు.

కాగా, పార్టీ నేతలతో మంగళవారం చంద్రబాబు తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఆయనకు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. దానిలో ఈ ప్రజా వేదిక ఒకటి. ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉండటంతో పార్టీ నేతలు, ప్రజలతో సమావేశం కావడానికి అది అనుకూలంగా ఉంటుందని నేతలు సలహా ఇచ్చినట్టు సమాచారం. ప్రతిపక్ష నేత హోదాలో నివాసం కోసం ప్రజావేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.