యాప్నగరం

కాల్చక్కర్లేదు.. వాళ్లను ఓటుతోనే ఖతం చేయండి: బాబు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో 2 రోజుల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన అయ్యలూరు రోడ్‌షోలో ప్రసంగిస్తూ..

TNN 19 Aug 2017, 2:28 pm
వాళ్లను కాల్చనక్కర్లేదు.. ఉరెయ్యాల్సిన అవసరం లేదు.. ఓటుతోనే ఖతం చేయండి.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. శనివారం (ఆగస్టు 19) నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో 2 రోజుల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన అయ్యలూరు రోడ్‌షోలో ప్రసంగిస్తూ.. ‘సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నన్ను కాల్చాలంటున్నారు.. ప్రజలకు మంచి చేస్తున్నందుకే నా బట్టలు ఊడదీస్తారా..’ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తనపై విపక్ష నేత చేసిన వాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Samayam Telugu chandrababu reacts on ys jagan comments in nandyal
కాల్చక్కర్లేదు.. వాళ్లను ఓటుతోనే ఖతం చేయండి: బాబు


‘అండగా ఉన్న ప్రజల కోసం నేను సర్వస్వం ధారబోస్తా. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తా. లాంఛనంగా ఓటేయాలని ప్రజల్ని కోరడానికే ఇక్కడకు వచ్చా. నంద్యాల ఒక చరిత్ర ఉన్న నియోజకవర్గం. ప్రశాంతమైన నియోజకవర్గం. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు ఉండే ప్రాంతం. వాళ్లు కాల్చి చంపాలని రెచ్చగొడుతున్నారు. ఇలాంటివి పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్‌లో వారేమవుతారో ఆలోచించండి. మీ చేతుల్లో ఉన్న ఓటు అనే ఆయుధంతోనే వాళ్లను ఖతం చేయండి’ అని వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

రైతులకు రూ.24 వేల కోట్లు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తమదని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ‘పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏమీ చేయని వ్యక్తులు ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటూ మాటలు చెబుతున్నారు. వాళ్లకు ప్రజల అభ్యున్నతి అవసరంలేదు. ఓట్లు దండుకొని డబ్బులు కూడబెట్టుకుంటారు తప్ప సేవ చేసే ఉద్దేశం వాళ్లకు లేదు. తెదేపా హయాంలోనే నంద్యాలలో అభివృద్ధి జరిగింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘ఒకప్పుడు జలయజ్ఞం ధనజయ్ఞంలా మారింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాం. పట్టిసీమను ఏడాది కాలంలోనే పూర్తిచేశాం. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు శ్రమిస్తున్నాం. 5 లక్షల పంట కుంటలు తవ్వి.. చెక్‌ డ్యామ్‌లు నిర్మించాం. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక. రాష్ట్రంలో వంట గ్యాస్‌ను అందరికీ అడిగి మరీ ఇస్తున్నాం’ అని సీఎం అన్నారు. నంద్యాలను స్మార్ట్‌ నంద్యాలగా మారుస్తానని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.