యాప్నగరం

వీడియో: సిబ్బంది కళ్లుగప్పి నగలు తస్కరిస్తున్న మహిళ

సిబ్బంది కళ్లుగప్పి బంగారు నగలతో ఉడాయించే ఘరానా మహిళా దొంగను చార్మినార్ పోలీసులు సోమవారం (జులై 16) అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ. 1.20 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు

Samayam Telugu 17 Jul 2018, 10:06 pm
సిబ్బంది కళ్లుగప్పి బంగారు నగలతో ఉడాయించే ఘరానా మహిళా దొంగను చార్మినార్ పోలీసులు సోమవారం (జులై 16) అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ. 1.20 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు దొంగతనానికి పాల్పడిన సీసీటీవీ ఫుటేజీలు కూడా విడుదల చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన అయేషా సిద్ధికా అలియాస్ శ్రవంతి సాధారణ గృహిణి. ఖరీదైన జీవితంపై కలలుగన్న అయేషా డబ్బుల కోసం దొడ్డిదారిని ఎంచుకుంది. దొంగతనాల ద్వారా సొమ్ము వెనకేసుకోవాలని చూసింది.
Samayam Telugu ayesha


ఖరీదైన దుస్తులు ధరించి పెద్ద ధనవంతురాలిలా పోజుకొట్టే అయేషా.. ఎంపిక చేసుకున్న నగల షాపుల్లోకి ప్రవేశించి వివిధ రకాల మోడళ్లను చూపించమని సిబ్బందిని పురమాయించేది. వాళ్లు ఒక్కో మోడల్ తీసి చూపిస్తుండగా.. కళ్లుగప్పి కొన్ని నగలను బ్యాగులో వేసుకొని ఉడాయించేది. గత ఫిబ్రవరి రెండో వారంలో చార్‌ కమాన్ సమీపంలోని వేద్ జ్యువెల్లర్ షాపులో రూ. 1.20 లక్షల విలువైన నగలు తస్కరించింది.
నగలు లేకపోవడం గమనించిన యజమాని సీసీటీవీ ఫుటేజీలను గమనించగా.. ఓ మహిళ వాటిని తన బ్యాగులో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలి కదలికలను గమనించి పక్క ప్రణాళికతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

భర్తకు తెలియకుండా నగల షాపులకు.. చోరీ సొత్తుతో రెస్టారెంట్లకు!
ఖరీదైన జీవితం కోసం తహతహలాడే అయేషా నగల షాపుల్లో చోరీలకు ప్రణాళిక వేసింది. పనుల నిమిత్తం తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె షాపులకు బయలుదేరి వెళ్లేది. నగదు, నగలను చోరీలకు పాల్పడి నేరుగా రెస్టారెంట్లకు వెళ్లేది. అక్కడ కావాల్సిన ఆహారం ఆర్డర్ చేసుకొని తిని ఇంటికి తిరిగొచ్చేది. ఇంత చేస్తున్నా.. ఈ విషయాలేవి ఆమె భర్తకు తెలియకపోవడం గమనార్హం.

2017 మార్చిలో అయేషా ఒకసారి లేడీ హాస్టల్‌లో ప్రవేశించి చోరీకి పాల్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డిఅన్నారంలో పట్టపగలే శ్రీనిధి హాస్టల్‌కు వెళ్లిన అయేషా.. అక్కడి సిబ్బందితో తాను ఎంబీఏ స్టూడెంట్‌నని, ఇదే హాస్టల్‌లో ఉంటున్నానని చెప్పింది. అనంతరం నేరుగా హాస్టల్‌లోకి ప్రవేశించి తాళం వేయని గదులను చూసి ల్యాప్‌టాప్, కొంత నగదును తస్కరించి మెల్లిగా అక్కణ్నుంచి జారుకుంది. ఈ కేసులో అరెస్టైన అయేషా ఇటీవలే బెయిల్‌పై బయటకొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.