యాప్నగరం

పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు: చంద్రబాబు

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద ఆదివారం (నవంబర్ 12) సాయంత్రం చోటు చేసుకున్న విషాదం తప్పకుండా బోటు నిర్వాహకుల బాధ్యతా రాహిత్యమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పడవ ప్రమాదంపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు.

TNN 13 Nov 2017, 3:58 pm
కృష్ణానది పవిత్ర సంగమం వద్ద ఆదివారం (నవంబర్ 12) సాయంత్రం చోటు చేసుకున్న విషాదం తప్పకుండా బోటు నిర్వాహకుల బాధ్యతా రాహిత్యమేనని సీఎం చంద్రబాబు అన్నారు. బోటు ప్రయాణించిన తీరు చూస్తుంటే డ్రైవర్‌కు ఆ మార్గంపై కనీస అవగాహన లేనట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. పవిత్ర సంగమం సమీపంలో బోటు కుదుపులకు లోను కావడంతో డ్రైవర్‌ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దీంతో పర్యాటకులంతా ఓ వైపునకు చేరుకున్నారు. దీంతో భారం పెరిగి బోటు బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్‌, అఖిలప్రియ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు’ అని చంద్రబాబు అన్నారు.
Samayam Telugu cm chadrababu naidu statement in ap assembly on boat capsize
పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు: చంద్రబాబు


బోటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు సీఎం చెప్పారు. ముగ్గురు బోటు సిబ్బంది ఆచూకీ తెలియడం లేదని ఆయన తెలిపారు. వాహనాలకు మాదిరిగానే బోట్లను కూడా నియంత్రించే విధంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పడవ ప్రమాదంపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు.

‘ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవు. ఆదివారం సాయంత్రం పర్యాటకులు వచ్చి మొదట పర్యాటక శాఖ బోటును ఎక్కారు. అయితే సమయం మించిపోయిందని వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రైవేటు బోటు సిబ్బంది వారిని ఎక్కించుకుని నదిలోకి తీసుకెళ్లారు. దీంతో ఈ దుర్ఘటన జరిగింది’ అని చంద్రబాబు చెప్పారు.

సోమవారం ఉదయం వరకు బోటు ప్రమాదంలో మరణించిన 20 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పవిత్ర సంగమానికి వచ్చిన పర్యాటకులు అక్కడే మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో 21 మందిని ఆసుపత్రికి తరలించగా వారిలో 17 మంది డిశ్చార్జి అయ్యారని, మరో నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.