యాప్నగరం

ఉప సర్పంచ్ హత్య వెనుక రెండో భార్య, ఆమె ప్రియుడు!

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్ (45) హత్య మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడి రెండో భార్య శిరీష అందుకు తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడి సాయంతో కడతేర్చింది.

TNN 13 Feb 2018, 10:56 pm
నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం ఉప సర్పంచ్ ధర్మానాయక్ (45) హత్య వెనుక అతడి రెండో భార్య శిరీష హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీష అందుకు తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడి సాయంతో కడతేర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ భర్త, కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యోదంతం మరవక ముందే.. అదే పార్టీకి చెందిన మరో నేత హత్యకు గురవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Samayam Telugu congress leader murder second wifes illegal affair killed with lover
ఉప సర్పంచ్ హత్య వెనుక రెండో భార్య, ఆమె ప్రియుడు!


చింతలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగార్జునపేట తండాకు చెందిన ధర్మానాయక్‌కు జమ్మన్‌కోటకు చెందిన సావిత్రితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. సావిత్రికి సంతానం కలగకపోవడంతో పదేళ్ల కిందట ఆమె చెల్లెలు శిరీషను ధర్మానాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

అయితే.. శిరీష తన భర్త కళ్లుగప్పి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రవినాయక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారిద్దరూ ధర్మానాయక్‌ను అంతం చేయడానికి పథకం వేశారు. సోమవారం (ఫిబ్రవరి 12) రాత్రి ధర్మానాయక్ మొదటి భార్య సావిత్రి.. శిరీష పెద్దకూతురును వెంటబెట్టుకొని పంటచేనుకు నీరు పెట్టడానికి వెళ్లింది. ధర్మానాయక్ తన కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు. శిరీష తన చిన్నకూతురుతో కలిసి ఇంటి లోపల నిద్రించింది.

అర్ధరాత్రి సమయంలో భర్త వద్ద పడుకున్న కుమారుణ్ని ఇంట్లోకి తీసుకెళ్లిన శిరీష.. పథకం ప్రకారం ప్రియుడు రవితో కలిసి ధర్మానాయక్ మంచం కింద నాటు బాంబు అమర్చింది. బాంబు పేలుడులో ధర్మానాయక్ అక్కడికక్కడే మరణించాడు. అతడి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ ఇరుగుపొరుగు కుటుంబాల వాళ్లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. శరీరం చిద్రమై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న ధర్మానాయక్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ధర్మానాయక్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి రెండో భార్య శిరీషను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న రవి కోసం గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.