యాప్నగరం

టీఆర్ఎస్ కక్షగట్టింది.. నాకు ఏం జరిగినా ఆ ముగ్గురిదే బాధ్యత: రేవంత్

వంద కేసులు పెట్టుకోండి.. కేసీఆర్‌ను వదిలేది లేదు.. లెక్కకు మిత్తితో సహా చెల్లిస్తాం..

Samayam Telugu 17 Sep 2018, 6:44 pm
టీఆర్ఎస్ తనపై కుట్రలు చేస్తోందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. అక్రమ కేసుల పేరుతో అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మాట్లాడిన రేవంత్.. టీఆర్ఎస్, కేసీఆర్‌పై ఫైరయ్యారు. టీఆర్ఎస్‌కు తానంటే భయం పట్టుకుందని.. అందుకే జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కమిటీల్లో తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతో ముందుగానే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
Samayam Telugu Revanth


కాంగ్రెస్ కమిటీల్లో ప్రకటనలకు ముందుగానే తనపై కేసులు పెట్టి.. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు రేవంత్. తనపై పెట్టిన ఓటుకు నోటు కేసు తప్పుడు కేసు అని హైకోర్టే తేల్చిందని.. అక్రమ కేసులు కూడా బనాయించారని విమర్శించారు. కేసుల్లో భాగంగా తను, తన బంధువుల చుట్టూ నిఘా పెట్టారని.. ఎవరికి ఏం జరిగినా కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావు బాధ్యులన్నారు. కేంద్ర నిఘా సంస్థలతో రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతాయని బీజేపీ హామీనిచ్చినట్లు తనకు సమాచారం ఉందన్నారు.

ఈడీని పంపినా.. వంద అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని.. కేసీఆర్‌ను వదిలేది లేదన్నారు. లెక్కకు మిత్తీతో సహా చెల్లిస్తామన్నారు రేవంత్. జగ్గారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఇప్పుడు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. ఆఖరికి ప్రజా సమస్యలపై పోరాడే విమలక్క, హరగోపాల్, చుక్కా రామయ్య ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. వీటన్నింటికి టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు రేవంత్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.