యాప్నగరం

కేసీఆర్ కన్నీరు మున్నీరయ్యారు; సిద్ధిపేట, సిరిసిల్లలే టీఆర్ఎస్ పతనానికి సంకేతం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆయన తెలిపారు. సిద్ధిపేట, సిరిసిల్లలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమన్నారు.

Samayam Telugu 29 May 2019, 7:10 pm
మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తిరస్కరణ మొదలైందన్న ఆయన.. సిద్ధిపేట, సిరిసిల్లలే మీ పతనానికి సంకేతమన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ కుంటి సాకులు వెతికే పనిలో పడ్డారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమన్న రేవంత్.. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమన్నారు.
Samayam Telugu revanth-ktr


‘‘చరిత్ర చెప్పుకోవాలనుకుంటే ఎవరి ఘనత ఏ పాటిదో చర్చ పెట్టుకుందాం. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఆ సందర్భంలో మీ తండ్రి కేసీఆర్ కన్నీరు మున్నీరుగా ఏడ్చి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కొన్ని నెలల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. మీ సొంత గడ్డ సిద్ధిపేట, మీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలలోనే మెజారిటీలు దారుణంగా పడిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్‌లో మీ కుటుంబ సభ్యులు ఓడిపోయారు. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది అనడానికి ఇదే సంకేతం. వాస్తవాలు ఇలా ఉంటే... మీ ఎడ్డి మాటలను మీడియా సంస్థలు గుడ్డిగా ప్రచురించాయి. వాస్తవాలు విశ్లేషించుకుని కథనాలు రాస్తే మీడియాకు విశ్వసనీయత ఉంటుంది.

మల్కాజ్‌గిరిలో నా గెలుపు గురించి మీరు మాట్లాడే ‌మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. 2009లో సిరిసిల్లలో మీ పరిస్థితి ఏమిటి? చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు స్వతంత్ర అభ్యర్థిపై కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బతుకు జీవుడా అని బయటపడ్డారు. మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు. వారిని అవమానించేలా మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలేం అమాయకులు కారు. ఇప్పుడిచ్చిన షాక్ ట్రీట్‌మెంట్ చాలకపోతే మరో షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తార’’ని కేటీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.