యాప్నగరం

జమ్మలమడుగులో నాటు బాంబుల కలకలం

జమ్మలమడుగులో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం స్థలం చదును చేస్తుండగా బాంబులు బయటపడ్డాయి. అనుమానం రావడంతో చుట్టు పక్కల వెతికితే భారీగా నాటు బాంబులు బయటపడ్డాయి.

Samayam Telugu 23 Jul 2019, 4:08 pm
కడప జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబులు కలకలం రేపాయి. ముద్దనూరు రోడ్డులో ఓ ఖాళీ స్థలంలో భారీగా బాంబులు బయటపడ్డాయి. మంగళవారం రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఖాళీ స్థలాన్ని జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. ఓచోట బకెట్ ట్రాక్టర్ డ్రైవర్‌ కంటపడింది. అనుమానంతో బయటకు తీసి చూస్తే.. నాటు బాంబులు కనిపించాయి. దీంతో షాక్ తిన్న అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ముద్దనూరు రోడ్డులోని స్థలం దగ్గరకు చేరుకున్న పోలీసులు బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో బకెట్ బయటపడిన చుట్టు పక్కల ప్రాంతాల్లో జేసీబీ సాయంతో వెతికి చూడగా.. మరికొన్ని బాంబులు బయటపడ్డాయి. మొత్తం 54 బాంబులు బయటపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ బాంబులు ఆ స్థలంలోకి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. స్థలం యజమానిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఈ బాంబుల్ని తెచ్చి అక్కడ దాచి ఉంచారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మైలవరం మండలం రామచంద్రయ్య పల్లెల్లో ఇలాగే గుర్తుతెలియని వ్యక్తులు ఓ పొలంలో బాంబులు నిల్వ చేశారు. ఆ బాంబులు పేలి పొలం పనులు చేస్తున్న సోమశేఖర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మరువకముందే జమ్మలమడుగులో బాంబుల బయటపడటం కలకలం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.