యాప్నగరం

నంద్యాల పోరు: డబ్బులు పంచుతున్న 22 మంది అరెస్ట్

నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ ఎన్నికను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే.

TNN 18 Aug 2017, 1:45 pm
నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ ఎన్నికను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో నగదు ఏరులై పారుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం నంద్యాల పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్, ఐలూరు ప్రాంతాల్లో నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ 22 మంది దొరికారు. వీరి వద్ద నుంచి రూ. 4 లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu currency distribution in nandyal police allegedly arrested 22
నంద్యాల పోరు: డబ్బులు పంచుతున్న 22 మంది అరెస్ట్


కాగా, వీరిలో 10 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా ప్రచారం జరుగుతోంది. అరెస్టయినవారు నంద్యాల, బేతంచర్ల, వెలుగోడు, కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే అరెస్టయిన వారిలో తమ కార్యకర్తలున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తమ కార్యకర్తలు డబ్బులు పంచలేదని, ప్రచారం చేస్తుంటే పోలీసులు తీసుకొచ్చేశారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ విషయంపై ఆరా తీశారు. ఖర్చుల కోసం తమ వద్ద డబ్బులు పెట్టుకుంటే అరెస్టు చేయడం ఎంత వరకూ సమంజసమని శ్రీకాంత్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. తక్షణమే తమ కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు అరెస్టయిన వారిలో తమ కార్యకర్తలు లేరని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అరెస్టయినవారితో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని చెబుతోంది. మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 10 మంది వైకాపా కార్యకర్తలయితే మిగిలివారు ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.