యాప్నగరం

ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న దాయే తుపాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి గురువారానికి వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Samayam Telugu 21 Sep 2018, 7:59 am
రెండు రోజుల కిందట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి గురువారం రాత్రికి మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు దాయే అని పేరు సూచించారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరాధ్రలోని కళింగపట్నానికి ఈశాన్యంగా 160 కిలోమీటర్ల దూరంలో దాయే కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతూ గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ, రాయలసీమ, తెలంగాణల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
Samayam Telugu దాయే తుపాను


తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం దాటాక తుపాను వేగం మరింత పెరుగుతుందని తెలిపింది. శుక్రవారం సాయంత్రం వరకు తుపాను ప్రభావం ఉంటుందని, దాయే బలహీనపడి శనివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించారు. ఒడిశా, ఉత్తరాంధ్రలపై దాయే ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో మెసెజ్‌లు జారీచేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గుడిసెలు, విద్యుత్తు తీగలు, స్తంభాలు, రహదారులు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని వివరించింది. అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. కోస్తాల్లో అన్ని రేవుల వెంబడి ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.