యాప్నగరం

Kondagattu Bus Accident: 60కి చేరిన మృతుల సంఖ్య

కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదం నింపిన ఘటనగా ఇది నిలిచింది.

Samayam Telugu 27 Dec 2018, 6:17 pm
తెలంగాణలో విషాదం నింపిన కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మరణించారు. తీవ్ర గాయాలపాలైన మరో 30 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu Kondagattu


జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్‌ రోడ్డులో మంగళవారం (సెప్టెంబర్ 11) ఉదయం 11 గంటలకు ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. డొక్కు బస్సు, ఓవర్ లోడ్, సమయానికి బ్రేకులు పనిచేయకపోవడం ప్రమాదానికి కారణంగా అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఓ వ్యాన్‌ను తప్పించబోయిన డ్రైవర్ శ్రీనివాస్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘోర విషాదం జరిగింది.

తల్లీ, బిడ్డా, భార్య, భర్త, అమ్మ, నాన్న.. ఇలాంటి బంధాలన్నీ ఒక్కసారిగా తెగిపోయిన అత్యంత విషాదకర ప్రమాదం ఇది. దేశంలోని రోడ్డు ప్రమాదాల చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన ఇది. దీంతో నిత్యం అంజన్న నామస్మరణతో మార్మోగే కొండగట్టు.. కొండంత విషాదంలో మునిగిపోయింది. ఘాట్‌ రోడ్డు ప్రయాణికుల రక్తంతో తడిసిపోయింది. రక్త ధారలు, తెగిపడిన శరీర భాగాలు, మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే బస్సు అదుపు తప్పి లోయలో 20 అడుగుల లోతులో పడింది. రెండు పల్టీలు కొట్టింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో ప్రమాదం జరిగిన తర్వాత ఊపిరాడకే ఎక్కువ మంది మరణించారు.

చదవండి: కొండంత విషాదం.. దేశంలోనే అతిపెద్ద దుర్ఘటన

కొండగట్టు బస్సు ప్రమాదంలో తమవారిని కోల్పోయిన బాధితులను బుధవారం ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌, వివిధ రాజకీయ పార్టీల నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎంపీ వినోద్‌ హామీ ఇచ్చారు.

కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ బుధవారం పరిశీలించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. 25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

తీవ్ర విషాదం నింపిన ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ, గవర్నర్‌ నరసింహన్‌‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.