యాప్నగరం

రాజ ప్రాసాదంలా తెలంగాణ సచివాలయ భవనం

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని రాజ ప్రాసాదంలా నిర్మించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.

TNN 7 Sep 2017, 8:42 am
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని రాజ ప్రాసాదంలా నిర్మించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలో ఉన్న షికాగో ఫెడరల్ భవన నమూనాలో, సరికొత్త హంగులతో సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు బైసన్ పోలోలో నిర్మించనున్న నూతన సచివాలయ భవన నమూనాను రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో విడుదల చేశారు. అలాగే జింఖానాలో పరేడ్ గ్రౌండ్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న సచివాలయంలో సీఎంవో, విభాగాధిపతుల కార్యాలయాలు ఉండనున్నాయి.
Samayam Telugu design of proposed new telangana secretariat building is ready
రాజ ప్రాసాదంలా తెలంగాణ సచివాలయ భవనం


సచివాలయ నమూనా విడుదల సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిపాలన సౌలభ్యానికి, సకాలంలో సమీక్షలు, చర్చలకు వీలుగా ఆధునిక సౌకర్యాలతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తే ప్రతిపక్షాలకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు బైసన్‌ పోలో మైదానంలో పర్యటించి మాట్లాడిన తీరును ఆయన విమర్శించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో విభాగాధిపతులు ఒకచోట, మంత్రులు మరోచోట ఉండటం సమస్యగా ఉంది. సమావేశాల నిర్వహణకు, పరిపాలన వేగవంతానికి ఇబ్బందిగా ఉంది. పలుచోట్ల కార్యాలయాల నిర్వహణకు అద్దె రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నాం. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, శాఖలకు సంబంధించిన విభాగాధిపతులు... ఇలా పాలనా యంత్రాంగమంతా ఒక్కచోటే ఉండాలన్న బృహత్తర ఆశయంతో, సీఎం కేసీఆర్‌ బహుళ అంతస్తుల భవన నిర్మాణ ఆలోచన చేశారు’ అని తుమ్మల వెల్లడించారు.

కాగా, నవంబరులో ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో అదే రోజు కొత్త సచివాలయ నిర్మాణ పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లలోపు పనులు పూర్తి చేసి.. 2020 కల్లా కొత్త సచివాలయం నుంచి పాలన ప్రారంభించాలని కేసీఆర్ యోచిస్తున్నారట. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని 61.32 ఎకరాల విస్తీర్ణంలోని బైసన్ పోలో, జింఖానా మైదానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో సచివాలయ భవన నమూనాలను ప్రభుత్వం తయారుచేయించింది. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్‌కు అందించిన డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు ఫైనల్ డిజైన్‌ను మంత్రి విడుదల చేశారు.

షికాగోలోని ఫెడరల్ భవనం ఇదే.. 1965లో దీన్ని కూలగొట్టారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.