యాప్నగరం

హైదరబాదీల కళ్లు మసకబారుతున్నాయి: ఐఏపీబీ

సెల్‌ఫోన్ల వాడకం పెరగడం, కంప్యూటర్ గేమ్స్, ఆహారపు అలవాట్లు టీనేజర్లలో దృష్టి సమస్యలకు ప్రధాన కారణమవుతున్నాయని ఐఏపీబీ ప్రధాన కార్యదర్శి పీటర్ హోలాండ్ తెలిపారు.

Samayam Telugu 15 Sep 2018, 12:16 pm
హైదరాబాద్‌ వాసుల్లో దృష్టిలోపాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే.. వారిలో ఒకరు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఐఏపీబీ (ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ కౌన్సిల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ హోలాండ్ స్పష్టం చేస్తున్నారు. కంటి ఆరోగ్యంపట్ల హైదరాబాద్ వాసులకు సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అంటున్నారు. నగర జనాభాలో 20 నుంచి 25 శాతం ప్రజలు వివిధ నేత్ర సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, కార్నియల్ డిసార్డర్స్ క్లౌడ్ వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.
Samayam Telugu eyes


హైదరాబాద్‌‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వేదికగా రెండురోజుల ఐఏపీబీ 20వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు హోలాండ్‌తోపాటు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హోలాండ్.. ప్రజలు కంటిచూపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అవసరమున్నా.. కళ్లద్దాలు ధరించడంలేదని అన్నారు. అవసరమైన కంటి పరీక్షలు, కంటి చికిత్సలను అశ్రద్ధ చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ఈ లక్ష్యాన్ని సాధించలేవని.. ఇందుకు ప్రభుత్వ భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అన్నారు. ఆయా సంస్థలు కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'కంటి వెలుగు' పథకం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన 'కంటి వెలుగు' పథకాన్ని గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక నేత్ర చికిత్సాలయాలు కంటి సమస్యలతో బాధపడేవారికి అవసరమైన చికిత్స అందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలని సూచించారు.

పాఠశాల విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు పెరగడం విచారించదగ్గ విషయమని హోలాంగ్ అన్నారు. ప్రధానంగా సెల్‌ఫోన్ల వాడకం పెరగడం, కంప్యూటర్ గేమ్స్, ఆహారపు అలవాట్లు టీనేజర్లలో దృష్టి సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఆసియా దేశాల్లోని సగం జనాభా హ్రస్వ దృష్టి (షార్ట్ సైట్) సమస్యలతో బాధపడే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించడానికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో నేత్ర చికిత్సాలయాలను హోలాండ్ ఏర్పాటు చేశారు. ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. వీటిలో 176 ప్రాథమిక నేత్ర చికిత్సాలయాలు, 18 సెకండరీ వైద్యకేంద్రాలు ఉన్నాయి. వీటిద్వారా ప్రజలు ఉచిత సేవలు పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.