యాప్నగరం

Visakha: పిల్లలతో కలిసి విషం తాగిన దంపతులు.. ముగ్గురు మృతి

ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న ఓ జంట తాము విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేయడమే కాదు, పిల్లలతోనూ తాగించిన విషాదకర ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 30 Dec 2018, 1:27 pm
ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన విషాదకర ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భార్యభర్తలు గొడపడి తాము పురుగుల మందు తాగడమే కాకుండా, అభం శుభం తెలియని చిన్నారులతోనూ తాగించారు. ఈఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందగా, భార్య హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతగిరి మండలం కివర్ల గ్రామానికి చెందిన పాంగి లక్ష్మణరావు (30), లక్ష్మీ (25) దంపతులు. వీరికి సిద్ధూ (6), వీణ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు రెండేళ్ల కిందట కే కోటపాడు మండలం చంద్రయ్యపేట గ్రామానికి వచ్చారు. అక్కడ కోళ్లఫారంలో పని దొరకడంతో పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే, ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడం, పిల్లల చదువు విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
Samayam Telugu suicide


ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి గురైన భార్యాభర్తలు పక్కనే ఉన్న పురుగుల మందును పిల్లలతో తాగించి తామూ తాగేశారు. ఈ ఘటనలో లక్ష్మణరావు (30), సిద్ధూ (6), వీణ (3) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మీ (25)ని గుర్తించిన కోళ్లఫారం యజమాని ఆమెను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించాడు. ప్రస్తుతం ఆమె విశాఖ కేజీహెచ్‌‌లో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.