యాప్నగరం

‘ఫణి’ తుఫాను ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఫణి తుఫాను కోస్తాంధ్ర తీరం వెంబడి ప్రయాణించినప్పుడు రాష్ట్రంలోని తేమ అంతటినీ లాగేసుకుంది. దీంతో తీర ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలో శుక్రవారం పొడి వాతావరణం కొనసాగింది.

Samayam Telugu 4 May 2019, 8:55 am
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రను వణికించి వెళ్లిపోయిన ‘ఫణి’ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర మినహా మిగతా ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు వడగాలుల ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు.
Samayam Telugu pjimage (2)


ఫణి తుఫాను కోస్తాంధ్ర తీరం వెంబడి ప్రయాణించినప్పుడు రాష్ట్రంలోని తేమ అంతటినీ లాగేసుకుంది. దీంతో తీర ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణలో శుక్రవారం పొడి వాతావరణం కొనసాగింది. దీంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది.

తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ వడగాల్పులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగింది. శనివారం నుంచి ఉత్తరాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది.

ఏపీలో శుక్రవారం నాటి ఉష్ణోగ్రతలు
కావలి- 44.6
ఒంగోలు-43.7
జంగమహేశ్వరపురం- 43.2
మచిలీపట్నం- 43.1
బాపట్ల-43
తిరుపతి- 42.8
నెల్లూరు-42.3
నందిగామ- 42.1
విజయవాడ-41.9
కాకినాడ-41.8
కర్నూలు-40

తెలంగాణలో..
నల్గొండ-44.4
ఖమ్మం-43.6
ఆదిలాబాద్-42.8
రామగుండం-42.6
నిజామాబాద్-42.5
మహబూబ్‌నగర్-42.5
హైదరాబాద్-40.2
హన్మకొండ-40
భద్రాచలం-38.6

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.