యాప్నగరం

దివికెగిసిన ఒగ్గు చుక్క..

ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య నిష్ణాతులు. ఆయణ్ని ఒగ్గుకథ పితామహుడిగా అభివర్ణిస్తారు. 14 ఏళ్ల ప్రాయం నుంచే ఆయన ఈ కళలో రాణించారు.

TNN 7 Dec 2022, 10:56 am
ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో ఆయన నిష్ణాతులు. ఆయణ్ని ఒగ్గుకథ పితామహుడిగా అభివర్ణిస్తారు. 14 ఏళ్ల ప్రాయం నుంచే చుక్క సత్తయ్య ఈ కళలో రాణించారు. ఒగ్గు కథకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడంతో ఆయన పోషించిన పాత్ర అమోఘం, అనితర సాధ్యం. ఆ మాటకొస్తే ఒగ్గు కథను ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడాయన. దేశవ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఎన్నో సన్మానాలు అందుకున్నారు.
Samayam Telugu Oggu Sattaiah
చుక్క సత్తయ్య


ఒగ్గు కథా గాన శైలిలో సమాజంలోని అనేక రుగ్మతలను చుక్క సత్తయ్య ఎలుగెత్తి చాటారు. కొన్ని అంశాలపై పోరాటం కూడా చేశారు. విద్య, కుటుంబ నియంత్రణ, వరకట్న వ్యవస్థ, మూఢ నమ్మకాలు, దురలవాట్లు తదితర అంశాలపై ఆయన ఒగ్గు కథల ప్రదర్శనలు ఇచ్చారు. చుక్క సత్తయ్య జీవిత విశేషాల ఆధారంగా ‘ఒగ్గు చుక్క’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీశారు.

తెలంగాణ పల్లెల్లో సుపరిచితులైన చుక్క సత్తయ్య.. ప్రస్తుత జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం గ్రామంలో 1936లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చౌదరిపల్లి ఆగయ్య, సాయమ్మ. 11 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్న సత్తయ్య ఒకటో తరగతి వరకే చదువుకున్నారు. నుదట రెండు పాదాల మాదిరిగా చుక్క ఉండటంతో అదే ఆయన ఇంటి పేరుగా స్థిర పడింది.

చుక్క సత్తయ్య సేవలకు కాకతీయ విశ్వవిద్యాలయం 2005లో ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం అవార్డుతో సత్కరించింది. 2004లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు రూ.50,000 నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

చుక్క సత్తయ్య.. జనగామ కేంద్రంగా ‘జ్యోతిర్మయి లలిత కళా సమితి’ని ఏర్పాటు చేసి ఒగ్గుకథ, ఒగ్గు డోళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు. చుక్క సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సత్తయ్య తెలంగాణతో పాటు దేశం గర్వించదగ్గ కళాకారుడని ఆయన కొనియాడారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.