యాప్నగరం

పాపికొండలు పర్యటక బోటులో అగ్ని ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగుడి నుంచి పాపికొండలకు బయలుదేరిన పడవలో వీరవరపులంక వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Samayam Telugu 11 May 2018, 1:05 pm
పాపికొండల్లో విహారయాత్రకు వెళ్లిన ఓ పడవకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగుడి నుంచి పాపికొండలకు బయలుదేరిన పడవలో వీరవరపులంక వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయానికి పడవలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బయలుదేరిన 10 నిమిషాలకే ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో వణికపోయారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు నదిలో ఈదుకుంటూ వెళ్లి 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని స్థానికుల సాయంతో మిగతావారిని రక్షించారు.
Samayam Telugu పడవ ప్రమాదం


మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మరికొందరు షాక్‌తో సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని వైద్యం కోసం తరలించారు. టూరిస్ట్ బోటులోని జనరేటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బోటు ప్రమాద వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి కలెక్టరుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ప్రయాణికుల యోగ సమాచారాన్నిఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.