యాప్నగరం

Jalagam Kondala Rao: మాజీ సీఎం సోదరుడు కన్నుమూత

ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలోని వ్యవసాయ కుటుంబంలో 1928 డిసెంబరు 10న జన్మించిన జలగం కొండలరావు విద్యాభ్యాసం నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో సాగింది.

Samayam Telugu 7 Dec 2022, 1:05 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు జలగం కొండలరావు (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. మంగళవారం ఆయన పరిస్థితి విషమించిందని, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు వెల్లడించారు. జలగం కొండలరావు ఎమ్మెల్యేగా ఒకసారి, ఎంపీగా రెండుసార్లు పనిచేశారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1977‌లో కాంగ్రెస్ నుంచి, 1980లో ఇందిరా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. కొండలరావు మృతి పట్ల సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Samayam Telugu PIC


ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలోని వ్యవసాయ కుటుంబంలో 1928 డిసెంబరు 10న జన్మించిన జలగం కొండలరావు విద్యాభ్యాసం నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో సాగింది. నాటి సాయుధ పోరాటంలో అన్న వెంగళరావుతో కలిసి పోరాడారు. 1950వ దశకంలోనే రాజకీయాల్లోకి వచ్చిన 1957 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన అనంతరం 1964లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవిని చేపట్టారు. ఆరేళ్లపాటు 1970 వరకు ఆ పదవిలో కొనసాగారు. అలాగే 1977 ఆరో సాధారణ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ సమయంలోనే ప్రయివేట్ మెంబర్స్ బిల్లు, తీర్మాన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తిరిగి ఏడో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచే విజయం సాధించారు. షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జలగం కొండలరావు ఎంతో కృషిచేశారు. 1960లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.