యాప్నగరం

తొలిసారి ఓటుహక్కు పొందిన గద్దర్

గద్దర్‌కు ఓటేసే వయసొచ్చి దాదాపు 50 ఏళ్లు పూర్తి కావొచ్చింది. ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ ప్రజలను చైతన్యం చేసేవ్యక్తి ఆయన.

Samayam Telugu 9 Oct 2018, 7:11 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్‌రావు) సిద్ధంగా ఉన్నారు. తన స్వస్థల నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే ఇతర స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. అయితే ఇందులో చాలా విశేషమైన అంశం ఉంది. అదేమంటే.. దాదాపు 70 ఏళ్ల వయసున్న గద్దర్ ఇప్పటివరకూ ఓటు హక్కు వినియోంచుకోలేదు. సరికదా ఓటు హక్కు కూడా పొందలేదు.
Samayam Telugu Gaddar


69 ఏళ్ల గద్దర్‌కు ఓటేసే వయసొచ్చి దాదాపు 50 ఏళ్లు పూర్తి కావొచ్చింది. అయితే ఆయన ఓటు వేయడం సంగతి అటుంచితే.. ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ ప్రజలను చైతన్యం చేసేవ్యక్తి గద్దర్. అలాంటి వ్యక్తి నేడు తాను కూడా ఓటేసేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇలాంటివి తప్పదు కదా. గతంలో గొంగళి భుజాన వేసుకుని ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన తాను.. నేడు తన పాటలతో ఓటుహక్కుపై ప్రచారం చేయడానికి సై అంటున్నారు.

దసరా తర్వాత చైతన్య కార్యక్రమం
జీవితంలో ఒక్కసారి కూడా ఓటేయని గద్దర్ విజయదశమి అనంతరం ‘ఒకే మనిషి, ఒకే ఓటు, ఒకే విలువ’ అంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తానంటున్నారు. ఈ మేరకు ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

తాను పుట్టింది పుట్టింది మెదక్‌ జిల్లా తూప్రాన్‌ అని, స్వస్థలమైన గజ్వేల్‌ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు చెప్పారు. తనను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని విపక్ష పార్టీలను కోరతానన్నారు. ప్రతి జిల్లాలోనూ మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. కేసీఆర్ ఏం చెప్పాడు.. చెప్పింది చేశాడా లేదా అని ప్రశ్నిస్తానని గద్దర్ వివరించారు. కాగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గజ్వేల్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.