యాప్నగరం

జగన్నాటకంతో సెల్ఫ్ గోల్: మంత్రి గంటా

ప్రతిపక్షనేత అయి ఉండి, అందులోనూ వేల కిలోమీటర్లు ఏపీలో పాదయాత్ర చేస్తున్న వ్యక్తి తమ పోలీసులను నమ్మకపోవడం దారుణమన్నారు.

Samayam Telugu 26 Oct 2018, 5:51 pm
తనపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడాన్ని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. పోలీసులపై నమ్మకం లేదంటూ, వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం ఏపీ పోలీసులను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. నమ్మకం లేదనడం ఏపీ పోలీసుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని చెప్పారు. దీనిపై మంత్రి గంటా అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అభిమానితో దాడి చేయించుకోవడంతో.. జగన్నాటకం రక్తికట్టకపోగా సెల్ఫ్ గోల్ అయిందని ఎద్దేవా చేశారు. గతంలో భాగస్వామ్య సదస్సు సమయంలోనూ జగన్ ఇలాంటివే చేశారని గుర్తుచేశారు.
Samayam Telugu Ganta Srinivasa Rao


ప్రతిపక్షనేత అయి ఉండి, అందులోనూ వేల కిలోమీటర్లు ఏపీలో పాదయాత్ర చేస్తున్న వ్యక్తి తమ పోలీసులను నమ్మకపోవడం దారుణమన్నారు. తెలంగాణ పోలీసులకు వాంగ్మూలం ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఫిన్‌టెక్ ఉత్సవాల నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు కత్తిదాడి ఘటనను సృష్టించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ పోలీసులపై, ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేని పక్షంలో కోర్టును ఆశ్రయించాలే తప్ప.. తోచిన వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షనేతకు భావ్యమేనా అని ప్రశ్నించారు.

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు వద్ద లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రాథమిక నివేదికలో విషయాల్ని పొందుపరిచారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏపీ పోలీసులు విచారణ చేపట్టగా ప్రతిపక్ష వైసీపీ నేతలు మాత్రం వారిని అనుమానించడం పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కుట్ర పన్నుతూ వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.