యాప్నగరం

ధవళేశ్వరం: అఖండ గోదావరి ఉగ్రరూపం.. ఒకటో ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Samayam Telugu 17 Aug 2018, 7:25 pm
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం (ఆగస్టు 17) ఉదయం 9.6 అడుగుల నీటి మట్టం ఉండగా.. మధ్యాహ్నానికి 12 అడుగుల వరకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి 12 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Samayam Telugu Godavari


శబరి నది కూడా ఉప్పొంగుతోంది. చింతూరు, విఆర్ ‌పురం మండలాల్లో వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ-ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రాల మధ్యన కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గిరిజన గూడేల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వరద ముంపులో లంక గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నదీపాయలు.. గౌతమి, వశిష్ట, వైనతేయ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

గోదావరి ఉగ్రరూపం


భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నీటిమట్టం 47.5 అడుగుల స్థాయికి చేరుకుంది. నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద నీరు భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు, విద్యుత్‌ స్తంభాలు నీట మునిగాయి.

గురువారం రాత్రి 11.20 నిమిషాలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటడంతో సబ్‌కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 48 అడుగులకు దాటితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతమైన అశోక్‌నగర్‌‌లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.