యాప్నగరం

గోదావరి పుష్కరాల తొక్కిసలాట: అతి ప్రచారమే కొంపముంచిందట!

గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 36 మంది దుర్మరణం చెందిన ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని తేలింది. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రచురించింది.

Samayam Telugu 19 Sep 2018, 1:57 pm
గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఓ కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని కమిటీ తేల్చింది. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
Samayam Telugu గోదావరి పుష్కరాల తొక్కిసలాట


2015, జులై 14న గోదావరి పుష్కరాల తొలిరోజున పుష్కరస్నానం కోసం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ఒక్కసారిగా కదలడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష సాక్షులు, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. పుష్కరాల తొలిరోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే మంచిదంటూ విస్తృత ప్రచారం చేయడమే ఈ ఘటనకు కారణమని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ఈ ప్రచారంతోనే వేలాదిగా తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని.. బారికేడ్లను తోసుకుంటా ఒక్కసారిగా నదిలో దిగేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. ముహూర్త కాలంపై మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రవచన కర్తలు చేసిన దుష్ప్రచారమే ఈ ఘటనకు కారణమని వెల్లడించింది. ప్రజలను గుడ్డిగా నమ్మించడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని.. అందువల్లే 27 మంది చనిపోయారని కమిటీ తెలిపింది. ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఒక్కసారిగా భక్తులు తోసుకొచ్చి ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన అఫిడవిట్‌ను జతచేస్తూ 17పేజీల నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కమిటీ అందజేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.