యాప్నగరం

అవినీతి కేసులో గవర్నర్ పేరూ చేరుస్తారు: టి.కాంగ్రెస్

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజినీరింగ్ అద్భుతమని, ఇంత గొప్ప ప్రాజెక్టుకు రూపకర్తగా ఉన్న ముఖ్యమంత్రిని కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పిలవాలనిపిస్తోందని గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

TNN 22 Jan 2018, 9:46 am
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజినీరింగ్ అద్భుతమని, ఇంత గొప్ప ప్రాజెక్టుకు రూపకర్తగా ఉన్న ముఖ్యమంత్రిని కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పిలవాలనిపిస్తోందని గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే గవర్నర్ పొగడ్తలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. గవర్నర్ పదవీకాలం పొడిగింపు కోసమో లేదంటే ప్రాజెక్టు అవినీతిలో కమీషన్ కోసమో.. నరసింహన్ టీఆర్ఎస్ ప్రభుత్వం భజన చేశారని తీవ్ర విమర్శలు చేశారు.
Samayam Telugu governor esl narasimhan is biased says telangana congress
అవినీతి కేసులో గవర్నర్ పేరూ చేరుస్తారు: టి.కాంగ్రెస్


ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి కాకుముందే అద్భుతమంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కితాబివ్వడమేంటని వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి కాకుంటే అధికార పార్టీ అవినీతిలో గవర్నర్‌కూ వాటా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ ఖాయమని జోష్యం చెప్పారు. ఆ అవినీతి కేసులో గవర్నర్ పేరును కూడా చేరుస్తారని హెచ్చరించారు. ఈ మేరకు గవర్నర్‌పై ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొంతకాలమైతే గవర్నర్ రాజ్‌భవన్‌ను టీఆర్ఎస్ భవన్ అంటారేమో అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీని, ప్రభుత్వాన్ని పొగడటం ఆ పదవిని కించపరచడమేనన్నారు. అంబేద్కర్ పేరుతో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా ఎందుకు మార్చారో గవర్నర్ ఎందుకు ప్రశ్నించలేదో అర్థంకావడంలేదన్నారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38,500 కోట్లతో డిజైన్ చేసిందని భట్టి గుర్తుచేశారు. 2014 నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరంగా మార్చి వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచినా గవర్నర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.