యాప్నగరం

బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తున్నాం: గవర్నర్

బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అసెంబ్లీ వేదికగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు.

Samayam Telugu 12 Mar 2018, 11:21 am
బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అసెంబ్లీ వేదికగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నరసింహన్ అన్నారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సాఫీగా సాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు.
Samayam Telugu governor narasimhan speech at telangana assembly budget session
బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తున్నాం: గవర్నర్


మేజర్, మీడియం నీటిపారుదల ప్రాజెక్టుల పనులు శరవేగంగా నడుస్తున్నాయని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని.. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యు‌త్‌ అందిస్తున్నట్ల వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టపరుస్తున్నామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. మూడున్నరేళ్లలో చాలా సవాళ్లను అధిగమించామని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నరసింహన్ వెల్లడించారు. గతేడాది హైదరాబాద్‌లో మెట్రోరైలును ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారుతో అనుసంధానం చేస్తు్న్నట్లు తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు కాబోతున్న మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం 23 సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలను ప్రభుత్వం ఎత్తివేసిందని చెప్పారు. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు. 500పైగా కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభించామని, హైదరాబాద్‌లో పలు కొత్త కంపెనీలు స్థాపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సోలార్ పాలసీ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. తెలుగు మహాసభలను తమ ప్రభుత్వం గొప్పగా నిర్వహించిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.