యాప్నగరం

కర్నాటకం: గవర్నర్ ఆదేశాలు ధిక్కరించిన సీఎం.. జరగని ఓటింగ్!

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీపై కర్ణాటక సీఎం కుమారస్వామి దుమ్మెత్తిపోశారు. 2006లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపాలని ప్రయత్నించిన బీజేపీ, అప్పుడు తన వద్దకే వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేయించిదన్నారు.

Samayam Telugu 19 Jul 2019, 2:02 pm

ప్రధానాంశాలు:

  • అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కర్ణాటక శాసనసభలో ప్రతిష్టంబన.
  • గవర్నర్ విధించిన గడువును ధిక్కరించిన సీఎం కుమారస్వామి.
  • చర్చ జరిగేంత వరకు ఓటింగ్ నిర్వహించే ప్రసక్తే లేదన్న స్పీకర్?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kar
కర్ణాటక శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామిని గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ విధించిన గడువు ముగిసినా, ఓటింగ్ జరగలేదు. దీంతో గవర్నర్ సూచనను సీఎం కుమారస్వామి ధిక్కరించినట్టుయ్యింది. తనను ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందా అని సీఎం ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరగాలని సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న బీజేపీ.. గవర్నర్‌కు అధికారాలున్నాయని పేర్కొంది.
మరోవైపు, విశ్వాసతీర్మానంపై చర్చ కొనసాగుతుందని, ముగిసే వరకూ ఓటింగ్ నిర్వహించే ప్రసక్తేలేదని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. చర్చ జరగకుండా బలపరీక్ష జరపలేమని తేల్చిచెప్పారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్‌ శాసించలేరని స్పీకర్ ఉద్ఘాటించారు. ఈ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్ వ్యవహారశైలిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది.

Read Also: కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య వాగ్వాదం!
అంతకు ముందు అవిశ్వాస తీర్మానం కుమారస్వామి మాట్లాడుతూ... యావత్‌ దేశం ఇప్పుడు కర్ణాటక రాజకీయ పరిణామాలను చూస్తోందని అన్నారు. 14 నెలల తర్వాత ఈ ప్రభుత్వం చివరి అంకానికి చేరుకుందని, నేనెప్పుడూ అధికారం కోసం బీజేపీ దగ్గరు వెళ్లలేదని, వారే నా దగ్గరకు వచ్చారన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ కోరడం వల్లే సీఎంగా బాధ్యతలు చేపట్టానని, ప్రతి సంకీర్ణంలోనూ విభేదాలు సహజమని అన్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా చేసుకుని బీజేపీ తరచూ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి ఆ దిశగా బీజేపీ యత్నాలు చేస్తోందని, అస్థిరంగా ఉందంటూ లేనిపోని వాదనలు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు.

తండ్రీ కొడుకులు నడుపుతున్న ప్రభుత్వం అంటూ హేళన చేస్తోందని, ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం లాంటి ముఖ్యమైన అంశాన్ని వదిలేసి అధికారం కోసం బీజేపీ తొందరపడుతోందని దుమ్మెత్తిపోశారు. సంఖ్యాబలం ఉన్నప్పుడు ఈ రోజే బలపరీక్ష పెట్టాలని బీజేపీ ఎందుకు పట్టుబడుతోందని, సీఎం సీటు కావాలంటే తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, అందులో తొందరేం లేదని అన్నారు. సోమవారం లేదా మంగళవారం వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని కుమారస్వామి సూచించారు. తానేమీ సీఎం అధికారాలను దుర్వినియోగం చేలేదని, భవిష్యత్తులోనూ చేయబోనని అన్న కుమారస్వామి, అంతకంటే ముందు దీనిపై చర్చ జరగాలని భావోద్వేగానికి లోనయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.