యాప్నగరం

హైదరాబాద్‌: ఏరులై పారుతోన్న నీరు.. రోడ్డెక్కితే నరకమే

భారీ వర్షానికి బోరబండ సాయిబాబా ఆలయం వద్ద నాలాలో కొట్టుకుపోయి ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 17 Oct 2018, 4:15 pm
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగర ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట‌ల్లో రోడ్లపై నీరు ఏరులై పారింది. అలాగే మాదాపూర్, మియాపూర్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, అబిడ్స్ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు భారీగా నిలిచిపోవడం ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. రోడ్లపై నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Samayam Telugu Rain1

ఇదిలా ఉంటే, భారీ వర్షానికి బోరబండ సాయిబాబా ఆలయం వద్ద నాలాలో కొట్టుకుపోయి ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, మూసాపేట, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేటల వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఐటెక్ సిటీ, సైబర్ టవర్స్, లెమన్ ట్రీ, గూగుల్ కార్యాలయం వైపు వెళ్లే వాహనదారులు కూడా నరకం చూస్తున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఈరోజు ట్రాఫిక్ కష్టాలు తప్పవు.
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిజాస్టర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో మొబైల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ దాన కిషోర్... అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.