యాప్నగరం

Telangana Elections: 12న ఓటర్ల తుది జాబితా.. హైకోర్టు అనుమతి

ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

Samayam Telugu 11 Oct 2018, 11:00 am
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా వెల్లడికి అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. సవరించిన ఓటరు జాబితా ప్రచురణకు కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు బుధవారం అనుమతినిచ్చింది. ఈనెల 12న జాబితాను ప్రచురించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈనెల 5న జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేసింది. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలని స్పష్టం చేసింది. తప్పుల సవరణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌ జోలికి తాము వెళ్లబోమని కూడా స్పష్టీకరించింది.
Samayam Telugu Rajath


ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది. జాబితాలో చేర్పులు, తొలగింపులకు అనుసరిస్తున్న విధివిధానాలు, మార్గదర్శకాలు, షెడ్యూల్‌ వివరాల్ని సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో భారీగా డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని, అర్హులను తొలగించారని పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఈనెల 5న విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత (ఈనెల 10) వరకు ఓటర్ల జాబితాను ప్రకటించొద్దని ఈసీని ఆదేశించింది. దీనిలో భాగంగానే బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

కోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన 19వ తేదీకి పది రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. చిరునామా, ఇతర మార్పుల కోసం వచ్చే దరఖాస్తులను నామినేషన్ల చివరి గడువు వరకు తీసుకుంటామని తెలిపారు. కొత్త ఓటర్లు, చిరునామా మార్పులు, ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులు కలిపి మొత్తం 33,14,006 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 17లోగా ఎన్నికల సిబ్బంది బదిలీ ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.