బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రతో పాటూ ఓ వీడియోకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరారు. శ్రీరామ నవమి రోజు జరిగిన శోభాయాత్రలో అనుమతి లేకుండా డీజేలు, ట్రక్కుల్ని ఉపయోగించినందుకు మంగళ్హాట్ పోలీసులు నోటీసులిచ్చారు. యాత్రలో భారీ లారీలను, ట్రక్కులు, టస్కర్లను వాడారు. అలాగే భారీగా శబ్ధం వచ్చే డీజేలను కూడా తీసుకొచ్చారు. వీటన్నంటికి అనుమతి తీసుకోకుండా ఉపయోగించినందుకు ఈ నోటీసులిచ్చి... మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఓ వీడియోకు సంబంధించి కూడా రాజాసింగ్కు నోటీసులు వెళ్లాయట. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారట. దీనిపై కొంతమంది ఫిర్యాదు చేయడంతో... మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులిచ్చారు. అలాగే విచారణకు కూడా హాజరుకావాలని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.