యాప్నగరం

హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించడానికి కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు తీసుకొస్తున్నారు.

TNN 5 Jul 2017, 9:44 am
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించడానికి కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు తీసుకొస్తున్నారు. ఈ మేరకు పెనాల్టీ పాయింట్లను ఏర్పాటుచేసి.. వాటి ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దుచేయనున్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆగస్టు 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu hyderabad police to introduce penalty point system august 1
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు


ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతోనే పెనాల్టీ పాయింట్‌ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఉల్లంఘనను బట్టి వాహన చోదకులకు పాయింట్లు కేటాయిస్తామన్నారు. 24 నెలల్లో 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు దాటితే ఏడాదిపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. లైసెన్స్‌ రద్దయిన సమయంలో వాహనాన్ని నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్లు, మూడోసారి దాటితే మూడేళ్ల పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు.

పాయింట్ల పకడ్బందీగా లెక్కించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని కమిషనర్ వెల్లడించారు. ఈ కొత్త పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారని చెప్పారు. హైదరాబాద్ రోడ్లపై నిత్యం ప్రయాణించేవారి భద్రత కోసమే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ఈ మేరకు తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను చేర్చుతూ ప్రభుత్వం జీవీ నం.26ను జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.