యాప్నగరం

నా అవయవాలు దానం చేయండి.. అందుకే ఉరి!

స్టాక్ మార్కెట్ల భారీ పెట్టుబడులు పెట్టింది. ఏడాది కాలంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో విశాఖ యువతి ఆత్మహత్య విషాదం నింపింది.

Samayam Telugu 11 Jun 2018, 3:07 pm
ఏడాది కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. కొంగర సుష్మ (27) అనే యువతి స్థానికంగా ఓ హోటల్‌లో శుక్రవారం (జూన్ 8) రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. షేర్ మార్కెట్లో పెద్ద ఎత్తున నష్టాలు రావడంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu sushma


విశాఖకు చెందిన సుష్మ శుక్రవారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె కొంత కాలంగా షేర్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మార్కెట్లో ఒడుదొడుకులు రావడంతో భారీ నష్టాలను చవిచూసింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది.

సంఘటనా స్థలం నుంచి సుష్మ రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె తన లేఖలో పేర్కొంది. ఏడాది కాలంగా ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిపింది. వైద్యులను సంప్రదించినా.. తాత్కాలిక ఉపశమనమే లభించింది గానీ, శాశ్వత పరిష్కారం దొరకలేదని వాపోయింది..

‘ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నా. చావే దీనికి పరిష్కారంగా తోచింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆత్మహత్యకు ఎన్నో మార్గాలున్నా.. ఉరి వేసుకుంటున్నా.. ఇలా చేస్తే శరీరంలోని కొన్ని అవయవాలైనా నా తర్వాత ఇతరులకు పనికొస్తాయనేది నా ఆలోచన. మరణం తర్వాత నా శరీర అవయవాలను దానం చేయండి’ అని సుష్మ తన లేఖలో పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.