యాప్నగరం

ఇక ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ మంత్రి కామినేని

రాజకీయాల్లో, బీజేపీలో కొనసాగుతా.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను.. నియోజకవర్గంలో ప్రజలకు శ్రీనుబాబులాగే అందుబాటులో ఉంటా..

Samayam Telugu 4 Dec 2018, 2:27 pm
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో కొనసాగినా.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటనానన్నారు. అలాగే టీడీపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. బీజేపీలోనే కొనసాగుతానని కామినేని క్లారిటీ ఇచ్చారు. ఇకపై నియోజకవర్గంలో శ్రీనుబాబులాగే ఉంటానన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్.. తన అభిప్రాయాన్ని వెల్లండించారు.
Samayam Telugu Kamineni


గత ఎన్నికల్లో వెంకయ్య నాయుడు పిలుపుతో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన కైకలూరు నియోజక వర్గానికి వచ్చి.. తనకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలను కోరారని గుర్తు చేశారు. అలా ప్రజలు ఇచ్చిన అవకాశంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. ఇకపై రాజకీయాల్లో ఉంటానని.. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని ప్రకటించారు కామినేని శ్రీనివాస్. ఆయన నిర్ణయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉన్నట్టుండి ఎన్నికలకు దూరం కావడానికి కారణమేంటనే చర్చ మొదలయ్యింది.

గతంలో టీడీపీలో పనిచేసిన కామినేని శ్రీనివాస్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 2014లో వెంకయ్యనాయుడి పిలుపు, ఆశీస్సులతో.. టీడీపీతో పొత్తులో భాగంగా కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత మంత్రివర్గంలో స్థానం సంపాదించి.. నాలుగేళ్లపాటు వైద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంతో.. ఇక్కడ ఏపీలో కూడా బీజేపీ మంత్రులుగా ఉన్న కామినేని, మాణిక్యాలరావులు పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత కామినేని టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.