యాప్నగరం

ఇంటర్ ఫలితాల చిచ్చు.. నేలరాలిన మరో విద్యాకుసుమం, 19కి చేరిన ఆత్మహత్యలు

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు. నారాయణ్‌పేట్ జిల్లా ధన్వాడలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థిని. అక్కడికక్కడే దుర్మరణం.

Samayam Telugu 27 Apr 2019, 6:33 pm
తెలంగాణలో ఇంటర్ ఫలితాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నారాయణ్‌పేట్‌ జిల్లా ధన్వాడ మండలంలోని కొండ్రోన్‌పల్లి గ్రామానికి చెందిన శిరీష (17) అనే ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక ఇంటి పైగది నుంచి కిందికి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. శిరీష మరణంతో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 19కి చేరింది.
Samayam Telugu shirisha
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య


వెంకట్రామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె శిరీష మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల వచ్చిన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో జువాలజీ సబ్జెక్టులో ఆమె ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఫలితాలు విడుదలైన నాటి నుంచి తనలో తాను కుమిలిపోతున్న శిరీష భయంకరమైన నిర్ణయం తీసుకుంది.

శనివారం (ఏప్రిల్ 27) ఉదయం ఇంటి పైపోర్షన్‌లోని గదిలోకి వెళ్లిన శిరీష.. కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు పెట్టింది. శిరీష ఆర్తనాదాలు విని కింది గదిలో ఉన్న ఆమె అక్క పరుగుపరుగున పైకి చేరుకుంది. కానీ, ఆమె అక్కడికి వెళ్లి చూసేలోపే శిరీష కిందికి దూకేసింది. అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు పొలం పనుల్లో ఉన్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి పరుగెత్తుకొచ్చారు. కాలిన స్థితిలో శిరీష మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. శిరీష ఆత్మహత్య ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొంత మంది స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.