యాప్నగరం

పోలవరం సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం.. టీడీపీకి ఛాన్స్ దొరికిందా?

పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2017-18 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణానికి రూ.55,548.47 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో అంచనా వేసింది.

Samayam Telugu 24 Jun 2019, 7:52 pm
ఏపీ జీవనాడి పోలవరం విషయమై కేంద్ర సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 6764.16 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మోదీ ప్రభుత్వం తెలిపింది. 2014 మార్చి చివరి నాటికి వెచ్చించిన రూ.5175.25 కోట్లలో రూ. 3777.44 కోట్లకు ఆడిట్‌ జరిగిందని.. రాష్ట్రం ఇచ్చే నివేదికల ఆధారంగా మిగతా నిధులను విడుదల చేస్తామని తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.47 కోట్లని ప్రకటించింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా బదులిచ్చిన జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా ఈ విషయాలను వెల్లడించారు.
Samayam Telugu polavaram


2017-18 ధరల ప్రాతిపదికన సవరించిన పోలవరం నిర్మాణానికి రూ.55,548.87 కోట్లు అవసరమనే అంచనాలకు ఆమోదం తెలిపామని మంత్రి తెలిపారు. రూ.55,548 కోట్లలో ఇరిగేషన్‌, నీటి సరఫరా వ్యయం రూ.50.987 కోట్లు. కాగా.. విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేసిన అంచనా రూ.4,560.91 కోట్లలో మార్పు లేదన్నారు.

సవరించిన అంచనాల ప్రకారం.. పోలవరం కుడి కాలువ పనులకు రూ. 4318.97 కోట్లు, ఎడమ కాలువకు రూ. 4,202.69 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు రూ. 4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని మంత్రి కటారియా చెప్పారు.

1941లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర నీటిపారుదల ముఖ్య ఇంజినీర్ ఎల్.వెంకటకృష్ణ అయ్యర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.129 కోట్లు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు అటకెక్కాయి. 1981లో నాటి ఏపీ సీఎం టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. 1985-86 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లు. తర్వాత ఏళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి కదలికా లేకపోయింది. వైఎస్ సీఎం అయ్యాక పోలవరం మళ్లీ తెర మీదకు వచ్చింది. 2010-11 లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,010 కోట్లకు చేరింది. టీడీపీ సర్కారు 2019 ఫిబ్రవరిలో పోలవరం అంచనాలను రూ.55,548.87 కోట్లకు పెంచింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోద ముద్ర వేసింది.

కాగా అంచనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం హడావుడిగా జీవో జారీ చేయడం వివాదాస్పదమైంది. ‘జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం అంచనా వ్యయాన్ని పెంచే ప్రతిపాదనకు కేంద్ర జలవనరుల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. ఆర్థిక శాఖ ఓకే చెప్పాక మాత్రమే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలి. కానీ చంద్రబాబు సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించింది’ అని విపక్షాలు ఆరోపించాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెంచిన అంచనాలకు కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలపడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.