యాప్నగరం

షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు పవన్ రూ.2 లక్షల విరాళం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి సమీపంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సందర్శించారు.

Samayam Telugu 3 Jul 2018, 6:26 pm
విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి సమీపంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా చక్కెర కర్మాగారం కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ మూతబడటానికి కారణాలను కార్మికులు పవన్‌కు వివరించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే దీక్షకు దిగుతామని కార్మికులు పవన్‌కు చెప్పారు. కార్మికుల దీనస్థితిని తెలుసుకుని చలించిపోయిన పవన్.. వారి సంక్షేమ నిధికి రూ.2 లక్షల విరాళం అందజేశారు. తమ పార్టీ తరఫున మరిన్ని విరాళాలు సేకరించి ఇస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.
Samayam Telugu Pawan1

తుమ్మపాల చక్కెర కర్మాగారం మూసివేత కారణంగా 40 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పవన్ కళ్యాణ్ అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ సమస్యను నాలుగు నుంచి ఆరు వారాల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కార్మికుల దీక్షకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. కులాల, మతాల ప్రాతిపదికన కాకుండా సమస్యల ప్రాతిపదికన ఉద్యమాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. తుమ్మపాల షుగర్స్ కార్మికులను కలసి మాట్లాడతానని తాను ప్రకటించగానే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా ‘తుమ్మపాల అంశంపై సమీక్ష’ అంటూ అమరావతిలో మీటింగ్ పెట్టారని పవన్ విమర్శించారు.
‘రూ.300 కోట్లు విలువచేసే ఫ్యాక్టరీని కేవలం రూ.10 కోట్లకు కాజేయాలని చూస్తున్నారు. ఈ విధమైన దోపిడీని జనసేన చూస్తూ ఊరుకోదు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, చెరకు రైతులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని పవన్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.